న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరవాలని ఆదేశించింది. కాగా, ఈ నెల 1న పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం రాహుల్, జూన్ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని అందులో పేర్కొన్నది.
అయితే ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, జూన్ 5 తర్వాత విచారణకు హాజరవుతానని రాహుల్ ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణ తేదీని ఈ నెల 13కి మార్చింది. కాగా, షెడ్యూల్ ప్రకారమే ఈడీ ప్రశ్నలకు ఎదుర్కొంటానని సోనియా గాంధీ ప్రకటించినప్పటికీ.. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది.
1938లో నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర యోధులు రూ.5 లక్షల మూలధనంతో నేషనల్ హెరాల్డ్ పత్రికను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక కాంగ్రెస్ హయాంలో హెరాల్డ్ ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో ఎన్నో ఆస్తులు కట్టబెట్టాయి. అయితే 2008లో ఆ పత్రిక మూతపడింది. జీతాలు తదితర బకాయిల చెల్లింపు కోసమంటూ పార్టీ నిధి నుంచి ఏజేఎల్కు రూ.90 కోట్లు కాంగ్రెస్ అప్పుగా ఇచ్చింది.
తర్వాత రెండేళ్లకు సోనియా, రాహుల్ మూడొంతుల వాటాదార్లుగా రూ.5 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ నేతలు, గాంధీల నమ్మకస్తులైన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ అందులో మిగతా వాటాదార్లు. రూ.90 కోట్ల రుణాన్ని ఏజేఎల్ ఎటూ తీర్చలేదు గనుక దాని తరఫున ఏక మొత్త పరిష్కారంగా రూ.50 లక్షలు చెల్లిస్తానంటూ యంగ్ ఇండియన్ సంస్థ.. కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. అటు రుణం తీర్చినందుకు బదులుగా ఏజేఎల్ నుంచి నేషనల్ హెరాల్డ్ వాటాలను తనకు బదలాయించుకుంది.