భువనేశ్వర్: మనీ లాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు ఆయన కుమారుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజనీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబంధించిన కేసులో సమల్తో పాటు ఆయన కొడుకు ప్రయస్కాంతికి కూడా సమన్లు పంపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అన్ని పత్రాలతో పాటు ఈడీ ఎదుట హాజరవ్వాలని నోటీసుల్లో తండ్రీ కొడుకులను ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఫోర్జరీ, మోసం కేసుల్లో ఈనెల 15న ఒడిశాలోని భద్రక్, భువనేశ్వర్ నగరాల్లోని పది ప్రదేశాల్లో ఈడీ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించింది. బరపడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(బీఎస్ఈటీ) సొసైటీకి చెందిన మాజీ అధ్యక్షుడు ప్రయస్కాంతి సమల్, కార్యదర్శి మనోజ్కుమార్ గోస్వామితో పాటు పలువురిని అరెస్ట్ చేసింది. తనిఖీల్లో పలు రకాల పత్రాలతో పాటు డిజిటల్ పరికరాలు, 9 లక్షల నగదు, తేదీ లేని చెక్కులు, ల్యాండ్ అగ్రిమెంట్, 40 లక్షల రూపాయల విలువైన టాటా ఫార్చునర్ కారును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.