ED to Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదేశించింది. సోమవారం 10 గంటలు, మంగళవారం తొమ్మిది గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని 50వ సెక్షన్ కింద రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రెండో రోజు కూడా ప్రశ్నలు అసంపూర్తిగా మిగిలి ఉన్నందున బుధవారం మరోమారు విచారణకు హాజరు కావాలని రాహుల్గాంధీకి జారీ చేసిన సమన్లలో ఈడీ పేర్కొంది.
రెండో రోజు మంగళవారం తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మంగళవారం ఉదయం 11.05 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్కు మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈడీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయటకు వచ్చిన రాహుల్ తిరిగి 4.45 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చారు.
రాహుల్గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా రెండో రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో నిరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, దీపీందర్ సింగ్ హుడా తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.