న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్యం విషయంలో బీబీసీ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఈ కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు గురువారం తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పలు డాక్యుమెంట్ల పరిశీలన, పలు కంపెనీల స్టేట్మెంట్లను రికార్డు చేసినట్టు వివరించారు. ముఖ్యంగా నేరుగా అందిన విదేశీ నిధుల పెట్టుబడులకు సంబంధించి పలు ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించామని వెల్లడించారు. గత ఫిబ్రవరిలో బీబీసీ ముంబై కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు అనంతరం సంస్థకు అందుతున్న నిధులపై కూడా ఈడీ దృష్టి సారించింది. ముఖ్యంగా భారత్లో బీబీసీ చూపిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కల్లో తేడాలను గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన నిధుల్లో చాలావాటికి నిర్దేశించిన పన్నులు చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు.
బీబీసీపై కక్ష సాధింపుతోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ కేసును నమోదు చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ప్రభావం వల్లే ఈడీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుంటే.. ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఇటీవల ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. 2020 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ద మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించడం తీవ్ర దుమారానికి కారణమైంది. రెండు భాగాలుగా దీనిని తీసుకువచ్చింది. ఇది వలసవాద మనస్తత్వానికి నిదర్శనంగా కనిపిస్తున్నదని విమర్శిస్తూ దాని ప్రసారాన్ని దేశంలో నిషేధించింది. ప్రత్యేక ఐటీ చట్టాన్ని ప్రయోగించి యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలలో సైతం ప్రసారం చేయనీయకుండా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేంద్రం ఆధ్వర్యంలో బీబీసీ ముంబై కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. అయితే తాము జరిపింది ఐటీ దాడులు కాదని, పన్నుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంగానే సర్వే నిర్వహించినట్టు తొలుత అధికారులు ప్రకటించారు. బీబీసికి సంబంధించిన పన్నుల చెల్లింపు, అంతర్జాతీయ టాక్సేషన్, నిధుల మళ్లింపు వివరాలను సేకరించడానికి సోదాలు చేపట్టినట్టు అప్పట్లో అధికారులు చెప్పారు. అయితే, బీబీసీపై దాడులను ఎడిటర్స్ గిల్ట్తో పాటు ప్రతిపక్షాలు ఖండించాయి. మీడియా సంస్థలను ఒత్తిడికి గురిచేసేందుకు ఐటీ అస్ర్తాన్ని ఉపయోగించుకోవడం సరి కాదని అభిప్రాయపడ్డాయి.