Tejashwi Yadav | కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సెటైర్లు విసిరారు. ఆ సంస్థలు తన ఇంట్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో తేజస్వి యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఒకవేళ శాంతి చేకూరుతుందంటే తమ ఇంట్లోనే ఈడీ, సీబీఐలకు ఆఫీసులు ఏర్పాటు చేయడానికి సిద్ధం అని చెప్పారు. `ఒకవేళ నా నిర్ణయం శాంతి చేకూర్చకపోతే నేనేమీ చేయలేను` అని వ్యాఖ్యానించారు.
తొలిసారి డిప్యూటీ సీఎంగా పని చేసినప్పుడు కూడా ఈ దర్యాప్తు సంస్థల గురించి తాను భయపడలేదని తేజస్వి యాదవ్ చెప్పారు. బీహార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేశారు. 2015-17 మధ్య బీహార్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆ తర్వాత తాను ఎంతో పరిణతి చెందానన్నారు.
2017లో విపక్ష నేతగా పని చేస్తున్నప్పటి నుంచి పరిణతి పొందానని తేజస్వి యాదవ్ అన్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించానని చెప్పారు. తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు.. పిల్లవాడిగా ఉన్న తనపై కేసు నమోదు చేశారని, ఒకవేళ తాను ఏదైనా నేరానికి పాల్పడి ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. 2017లో తేజస్వి యాదవ్పై హవాలా లావాదేవీల కేసు నమోదైన సంగతి తెలిసిందే.