(స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ) హైదరాబాద్, సెప్టెంబర్ 21: ‘తృణమూల్ కాంగ్రెస్ నేతలపై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతున్నది. అందుకే, ఈడీ అధికారులను కేంద్రం.. బెంగాల్కు ప్రత్యేకంగా పంపించనున్నది’& ఆగస్టు 21న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలివి. ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు ఈడీని ఏ స్థాయిలో వినియోగిస్తున్నదో ఘోష్ వ్యాఖ్యలతో అర్థం చేసుకోవచ్చు. మోదీ హయాం లో రాజకీయ నేతలపై ఈడీ నమోదు చేసిన కేసుల్లో 95 శాతం కేసులు విపక్ష నేతల మీదే రికార్డయ్యాయి.
యూపీఏ పదేండ్ల పాలనలో (2004-2014) ఈడీ బారిన పడ్డ విపక్ష నేతలు 54% ఉండగా, ఎన్డీయే ఎనిమిదేండ్ల కాలంలో (2014-22) ఈడీ టార్గెట్ చేసినవారిలో ఏకంగా 95% ప్రతిపక్ష నేతలే ఉన్నారు. యూపీఏ పాలనలో ఈడీ 26 మంది ప్రముఖ నేతల నేరాలపై దర్యాప్తు నిర్వహించగా, వారిలో 14 మంది విపక్ష నాయకులున్నారు. అదే ఎన్డీయే పాలనలో ఈడీ 121 మంది రాజకీయ నాయకులపై దర్యాప్తు నిర్వహించగా, వారిలో ఏకంగా 115 మంది విపక్ష నేతలే ఉండటం గమనార్హం. మొత్తంగా మోదీ హయాంలో రాజకీయ నాయకులపై ఈడీ దాడులు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ మేరకు గత 18 ఏండ్లలో ఈడీ నమోదు చేసిన కేసులపై ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ సంచలనాత్మక కథనాన్ని వెలువరించింది.
బీజేపీలోకి రాగానే అటకెక్కనున్న కేసులు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈడీ కేసులు ఎదుర్కొన్నవారు.. బీజేపీ తీర్థం పుచ్చుకోగానే కేసులు మరుగునపడిపోతున్నాయి. ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 2015లో కాంగ్రెస్లో ఉన్నప్పుడు శారద చిట్ఫండ్ స్కామ్లో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ కూడా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. ఆయన బీజేపీలో చేరగానే ఆ కేసు పత్తాలేకుండా పోయింది. గత ఏడాది బెంగాల్లో ఎన్నికలు జరిగేంతవరకూ టీఎంసీ నేతలుగా ఉన్న సువేందు అధికారి, ముకుల్రాయ్పై ఈడీ కేసులు నమోదు చేసింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసు పేరిట వేధింపులకు గురిచేసింది. వాళ్లు కమలదళంలోకి రాగానే ఆ కేసు అటకెక్కింది.
అధికారం కోసమే: ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ
అవినీతిపరులను శిక్షిస్తున్నామని మోదీ అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ లక్ష్యం అవినీతి కాదు.. రాజకీయం, అధికార దాహం. అందుకే ఎంపిక చేసిన నేతలపై, వ్యాపారవేత్తలపై మాత్రమే సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతుంటాయి. ఈడీ ఇప్పటివరకు 5 వేలకుపైగా కేసులు వేస్తే కేవలం 23 మందికి మాత్రమే శిక్ష పడింది. 99 శాతం మందిపై ఇంకా ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. కానీ బీజేపీ నేతలు నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరిపై అవినీతి ముద్ర వేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు ఉండవు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అవినీతిపై ఎలాంటి చర్యలు కనిపించవు. దీనిని బట్టి బీజేపీ లక్ష్యం అవినీతి కాదని, ప్రతిపక్షాలపై అవినీతి బురద చల్లి వారు ఏకం కాకుండా అడ్డుకోవడమేనని స్పష్టం అవుతున్నది.
ఎన్డీయే హయాంలో విపక్షాలపై ఈడీ కేసులు
కాంగ్రెస్-24, టీఎంసీ-19, ఎన్సీపీ-11, శివసేన-8, డీఎంకే-6, బీజేడీ-6, ఆర్జేడీ-5, బీఎస్పీ-5, ఎస్పీ-5, టీడీపీ-5, ఆప్-3, ఐఎన్ఎల్డీ-3, వైఎస్ఆర్సీపీ-3, సీపీఎం-2, ఎన్సీ-2, పీడీపీ-2, స్వతంత్రులు-2, అన్నాడీఎంకే-1, ఎంఎన్ఎస్-1, ఎస్బీఎస్పీ-1, టీఆర్ఎస్-1.
యూపీఏ హయాంలో విపక్షాలపై ఈడీ కేసులు
టీఎంసీ-7, బీజేపీ-3, బీఎస్పీ-2, బీజేడీ-1, వైఎస్ఆర్సీపీ-1