ముంబై, ఏప్రిల్ 5: గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న శివసేన ఎంపీ సంజయ్రౌత్, ఆయన కుటుంబానికి చెందిన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం జప్తు చేశారు. దక్షిణ ముంబై సమీపంలోని అలీబాగ్లో ఎనిమిది స్థలాలు, ముంబైలోని దాదర్ సబర్బ్లో ఒక ఫ్లాట్ను మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్ చేసినట్టు తెలిపారు. రూ. 1,034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఈ ఆస్తులను స్తంభింపజేసినట్టు పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్రౌత్ను గత ఫిబ్రవరిలో అరెస్టు చేసిన అధికారులు ఛార్జిషీట్ నమోదు చేశారు. మరో మనీల్యాండరింగ్ కేసులో సంజయ్రౌత్ భార్య వర్షరౌత్ను నిరుడు ఈడీ ప్రశ్నించింది.
మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్, ఆయన కుటుంబం, కంపెనీలకు చెందిన రూ. 4.81 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్టు మంగళవారం ఈడీ అధికారులు తెలిపారు. 2015-16లో సత్యేందర్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆయనకు చెందిన కంపెనీలకు ఇతర షెల్ కంపెనీల నుంచి రూ. 4.81 కోట్ల నిధులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆస్తులను స్తంభింపజేసినట్టు పేర్కొన్నారు. కాగా ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ విధానాలను సత్యేందర్ తూర్పారబట్టడం తెలిసిందే.
నాగ్పూర్, ఏప్రిల్ 5: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్పై పలు పిటిషన్లు వేసిన నాగ్పూర్కు చెందిన న్యాయవాది సతీశ్ ఉకే, ఆయన సోదరుడు ప్రదీప్ ఉకేపై ఈడీ అధికారులు మంగళవారం మనీల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. ఐదురోజుల కిందటే ఉకే ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు ఆయన్ని, ఆయన సోదరుడిని అరెస్టు చేశారు.
ఈడీలోని ఉన్నతాధికారులపై వచ్చిన అక్రమ వసూళ్ల ఆరోపణలపై విచారించేందుకు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. బీజేపీకి ఏటీఎంలుగా పనిచేస్తూ ఈడీలోని నలుగురు ఉన్నతాధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సంజయ్రౌత్ గత నెల ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పడిన రోజునే తనపై ఈడీ చర్యలు మొదలెట్టిందని రౌత్ మండిపడ్డారు.
ఈడీ చర్యలను ‘మధ్యతరగతి మరాఠీలపై దాడి’గా సంజయ్రౌత్ అభివర్ణించారు. కేంద్రం ఒత్తిళ్లకు తాను ఏమాత్రం భయపడబోనని, తలొగ్గబోయేది లేదని స్పష్టంచేశారు. స్తంభింపజేసిన ఆస్తులు తాను కష్టపడి సంపాదించుకొన్నవని పేర్కొన్నారు. ఏజెన్సీ అధికారుల అక్రమ వసూళ్లపై ప్రశ్నించినందుకే ఈడీ ఈ చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఆస్తులు అటాచ్ చేయండి. కాల్పులు జరపండి. జైలుకు పంపండి. అయినా ఏమాత్రం భయపడేది లేదు. సంజయ్ రౌత్ అనే వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడు, శివ సైనికుడు. అతను పోరాడతాడు. ప్రతి ఒక్కరి బండారం బయటపెడతాడు. చూస్తూ కూర్చోను. వాళ్లను (కేంద్రం) డాన్స్ చేయనీయండి. నిజం వెలుగుచూస్తుంది’ అని ఘాటుగా స్పందించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తాప్సే ఆరోపించారు. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇరుకున పెట్టాలని చూస్తున్నాయని, అయితే తమ కూటమి పూర్తికాలం అధికారంలో ఉంటుందని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు, మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు.