న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంతో పాటు మరికొందరు నిందితులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో కార్తీకి చెందిన రూ.11.04 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసినట్టు మంగళవారం ఈడీ తెలిపింది.
ప్రస్తుతం మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈ కేసులో కార్తి చిదంబరంతో పాటు పలువురిపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐపీబీ అప్రూవల్ కోసం అప్పటి కేంద్రమంత్రి చిదంబరం కుమారుడైన కార్తి చిదంబరానికి లంచం ఇచ్చారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ అక్రమ నిధులను కార్తి చిదంబరం తన షెల్ కంపెనీలకు తరలించారని ఈడీ భావిస్తున్నది.