న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరస్టై తీహార్ జైలులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఇదే కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ చేసింది. సిసోడియా బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానున్న ఒక రోజు ముందు ఈ అరెస్ట్ చేయడం గమనార్హం. మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సిసోడియాను సీబీఐ గత నెల అరెస్ట్ చేయగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి హవాలాకు పాల్పడ్డారంటూ ఈడీ ఆయనను మంగళవారం జైలులో ఐదు గంటల పాటు ప్రశ్నించింది. గురువారం కూడా కొద్దిసేపు ప్రశ్నించిన ఈడీ.. సిసోడియాను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
బెయిల్ వస్తుందన్న భయంతోనే..
సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ‘లిక్కర్ కేసులో సిసోడియాను తొలుత సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన ఇంటిపై చేసిన దాడిలో సీబీఐకి ఎలాంటి నగదు, ఆధారాలు కాని లభ్యం కాలేదు. శుక్రవారం సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణకు ఉన్నది. ఆయన బెయిల్పై విడుదల కానున్నారు. దీంతో ఈడీ ఇప్పుడు సిసోడియాను అరెస్ట్ చేసింది. రోజుకో కేసు బనాయించి ఆయనను జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. వారికి ప్రజలే తగిన సమాధానం ఇస్తారు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.