ముంబై, మార్చి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.1.37 లక్షల కోట్లకుపైగా తరిగిపోయింది. వరుసగా మూడు రోజులు లాభాల్లో కదలాడిన సూచీ లు.. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో 12 పైసలు పెరిగినా.. మార్కెట్లు పుంజుకోలేకపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రూ.72.79కి బలపడింది. అయినా బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 487.43 పాయింట్లు లేదా 0.95 శాతం కోల్పోయి 50,792.08 వద్దకు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 143.85 పాయింట్లు లేదా 0.95 శాతం పడిపోయి 15,030.95 వద్ద నిలిచింది. నిజానికి ఒకానొక దశలో సెన్సెక్స్ 51,717 పాయింట్ల స్థాయికి ఎగిసింది. అయితే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఆటో షేర్లలో మదుపరులు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా 50,538.43 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. అయితే చివరకు మళ్లీ కోలుకున్నది. అయినప్పటికీ బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ.1,37,590.62 కోట్లు హరించుకుపోయి రూ.2,07, 89,062.84 కోట్లకు పరిమితమైంది. బజాజ్ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఐరోపా ప్రధాన సూచీలూ నష్టాల్లోనే స్థిరపడ్డాయి.
ఆర్బీఐ పీసీఏ నుంచి ఐడీబీఐ బ్యాంక్ బయటకు రావడంతో సంస్థ షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శుక్రవారం షేర్ విలువ దాదాపు 10% పెరిగింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో 9.80% వృద్ధితో రూ.42 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.44.80 వద్దకూ వెళ్లడం గమనార్హం.