EVM | ఈవీఎంల విషయంలో వస్తున్న ఆరోపణలపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొట్టిపడేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ప్రతిసారీ ఈవీఎంలపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ సారి బ్యాటరీపై ఆరోపణలు వచ్చాయని.. తర్వాత ఇంకేవస్తాయోనన్నారు. ఓసారి ఈవీఎంలు హ్యాక్ చేయవచ్చని.. ఓసారి పేజర్లా పేలుతుందని చెబుతుంటారన్నారు. అయితే, తాము ప్రతీసారి ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఈవీఎంలు, బ్యాటరీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించామన్నారు. హర్యానాలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తామన్నారు.
ప్రతి పాయింట్తో పూర్తిగా స్పందన తెలియజేస్తామన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ పబ్లిష్ చేస్తామన్నారు. ఈవీఎంల వినియోగంపై కమిషన్ నుంచి కౌంటింగ్ వరకు అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ప్రతి లోక్సభ ఆర్ఓను కోరామన్నారు. ఫలితాలు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల నుంచే ఈవీఎంల ర్యాండమైజేషన్, చెకింగ్ ప్రక్రియ ప్రారంభవుతుందన్నారు. ఆ తర్వాత తనిఖీలు, నిల్వ, ఆ తర్వాత బయటకు తీయడం, కమిషన్ చేయడం, పోలింగ్ రోజున ఈవీఎంలు తీయడం, ఆ తర్వాత అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం, కౌంటింగ్ మొదలు నుంచి ముగిసే వరకు.. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈవీఎంల ప్రతి ప్రక్రియలో పాల్గొంటారన్నారు. పోలింగ్కు ఐదు నుంచి ఆరు రోజుల ముందు ఈవీఎంను కమీషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.
గుర్తులను సైతం అదే రోజు ఫీడ్ చేస్తారన్నారు. కమీషన్ చేసిన తర్వాత, బ్యాటరీ సీలు చేస్తారని.. అభ్యర్థితో పాటు ఏజెంట్లు సంతకం చేస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు మూడంచెల భద్రతలో ఉంటాయని.. పోలింగ్ రోజు సైతం ఇదే జరుగుతుందన్నారు. ఓటు వేసిన తర్వాత కూడా ఈవీఎం చూపించి అభ్యర్థి ఏజెంట్ సంతకం తీసుకుంటారని తెలిపారు. ఇలా మరెక్కడా జరుగదని.. ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారన్నారు. ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలు ఉంటాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. బ్యాటరీ వేసిన సమయంలో ఛార్జ్ శాతం, వోల్టేజ్ ఎంత వరకు ఉందో కనిపిస్తుందన్నారు. ఈవీఎంలను ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉంచిందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో, కాంగ్రెస్ ఈవీఎం, బ్యాటరీ ట్యాంపరింగ్కు పాల్పడిందని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసింది. 20 అసెంబ్లీ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ మెమోరాండం ఇచ్చింది. కాంగ్రెస్ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.