చెన్నై: దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ఎలక్షన్ కమిషన్ (ఈసీ)దే ఏకైక బాధ్యత అని మద్రాస్ హైకోర్టు ఆరోపించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేసు నమోదు చేయాల్సిందని వ్యాఖ్యానించింది. తమిళనాడులోని కరూర్ నియోజకవర్గం పోలింగ్ సందర్భంగా కరోనా నియమాలు పాటించేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషిన్పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెనర్జీ, జస్టిస్ సెంటిల్కుమార్ రామమూర్తితో కూడిన తొలి ధర్మాసనం సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్కు ఈసీనే ప్రధాన కారణమని మండిపడింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు మరో గ్రహంలో ఉన్నారా? అని ఈసీ తరుఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.
కోర్టు ఆదేశించినప్పటికీ రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీల సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయడంలో ఈసీ విఫలమైందని ధర్మాసనం విమర్శించింది. ఎన్నికల ప్రచారాల సందర్భంగా మాస్కులు, శానిటైజర్లను వినియోగించకపోవడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడాన్ని కోర్టు గమనించిందని పేర్కొంది.
మే 2న కౌంటింగ్ నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలపై ఈసీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఈ నెల 30లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విపలమైతే మే 2న ఓటింగ్ కౌంటింగ్ను నిలిపివేస్తామని ఈసీని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. ప్రజల ప్రాణాలు, సంరక్షణ తర్వాతే ఏదైనా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.