న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని, వాటి సమగ్రత, ప్రజాస్వామిక పాలనను పరిక్షించేందుకు వాటిని రాజకీయ ప్రాబల్యం నుంచి దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న శనివారం స్పష్టం చేశారు. పాట్నాలోని చాణక్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘హక్కులకు అతీతమైన రాజ్యాంగవాదం: నిర్మాణం ఎందుకు ముఖ్యం’ అనే అంశంపై జరిగిన స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ సాధారణ రాజకీయ ప్రకియ తటస్థతను, జవాబుదారీతనాన్ని కల్పించలేని కీలక రంగాలను పర్యవేక్షించడానికి రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగానే ప్రత్యేక సంస్థలను సృష్టించిందని జస్టిస్ నాగరత్న అన్నారు.
అటువంటి సంస్థలు రాజకీయ ప్రక్రియల ప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా పనిచేయడం అత్యంత ముఖ్యమని ఆమె నొక్కి చెప్పారు. రాజ్యాంగంలోని 324 అధికరణ కింద కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ ప్రాముఖ్యతను ఆమె ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఎన్నికలు కేవలం కాలానుగుణ సంఘటనలు మాత్రమే కాదని. అవి రాజకీయ అధికారాన్ని ఏర్పాటు చేసే అసలైన యంత్రాంగమని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై నియంత్రణే ప్రజాస్వామ్యంలో రాజకీయ పోటీ పరిస్థితులను సమర్థవంతంగా నిర్ధారిస్తుందని అన్నారు.
టీఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎన్నికల సమగ్రతను నిర్ధారించే బాధ్యత అప్పగించబడిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగ అధికార సంస్థగా ఎన్నికల సంఘాన్ని కోర్టు గుర్తించిందని ఆమె పేర్కొన్నారు. సకాలంలో ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాల్లో సులభమైన మార్పులు జరుగుతాయని మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం సమర్థవంతంగా నిరూపించిందన్నారు. ఆ ప్రక్రియపై నియంత్రణ అంటే వాస్తవానికి రాజకీయ పోటీ పరిస్థితులపైనే నియంత్రణ కలిగి ఉండటమని జస్టిస్ నాగరత్న తెలిపారు.
ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ రాజ్యాంగపరమైన పాత్ర గురించి కూడా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ ప్రజా వ్యయం అనేది కేవలం ఒక పరిపాలనా విధి మాత్రమే కాదని, అది వనరులను కేటాయించడానికి, ప్రభుత్వ ప్రాధాన్యతలను అమలు చేయడానికి ఉపయోగపడే ఒక యంత్రాంగమని పేర్కొన్నారు. స్వతంత్ర పర్యవేక్షణ లేకపోతే ఆర్థిక నిర్ణయాలు పరిశీలన, జవాబుదారీతనం నుండి తప్పించుకోవచ్చని ఆమె వివరించారు. కాగ్ బాహ్య ఆడిట్లను నిర్వహించడం ద్వారా ప్రజావ్యయాన్ని భరించే కార్యనిర్వాహక, శాసన సభలకు సంబంధం లేని ఒక స్వతంత్ర అధికార సంస్థ ద్వారా ఆ వ్యయాన్ని పరిశీలించేలా నిర్ధారిస్తుందని ఆమె చెప్పారు.