Uttarkashi | ఉత్తరాఖండ్లోని (Uttarakhand) ఉత్తరకాశీలో (Uttarkashi) మరోసారి భూకంపం వచ్చింది. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం (Earthquak) వచ్చింది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 12.45 గంటలకు మరోసారి, అనంతరం 1.01 గంటలకు మూడోసారి భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 2.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. వరుస భూకంపాలతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.
ఈ నెల 2న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ (Pauri Garhwal) జిల్లాలో 2.4 తీవ్రతతో భూమి కంపించింది. ఇక గతేడాది డిసెంబర్ 28న 3.1 తీవ్రత ఉత్తరకాశీలో భూకంపం (Earthquak) సంభవించిన విషయం తెలిసిందే. అంతకుముందు నేపాల్లోని (Nepal) బాగ్లంగ్ జిల్లాలో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. తెల్లవారుజామున 1.23 గంటలకు జిల్లాలోని అధికారి చౌరు ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ (NEMRC) వెల్లడించింది. మరో 40 నిమిషాల వ్యవధిలో జిల్లాలోని మరో ప్రాంతం భూమి కంపించిందని తెలిపింది.