చొప్పదండి, ఏప్రిల్ 6: అదుపు తప్పిన ఓ బొలేరో వాహనం రోడ్డుపక్కన టేలాలోకి దూసుకెళ్లింది. అందులో చికెన్ కొడుతున్న నిర్వాహకుడు అక్కడికక్కడే మృతి చెందడం కలచివేసింది. చొప్పదండి ఎస్ఐ వంశీక్రిష్ణ వివరాల ప్రకారం.. ఆర్నకొండకు చెందిన కొలిపాక మార్కండేయులు(46), గ్రామంలోని రాష్ట్ర రహదారి పక్కన టేలాలో చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. భార్య సమంత కూలీ పనిచేస్తున్నది. కొడుకు మహేశ్ బట్టల దుకాణంలో పనిచేస్తుండగా, కూతురు అంజలి గంగాధరలోని కస్తూర్బాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. మార్కండేయులు రోజువారీలాగే మధ్యాహ్నం 2గంటల ప్రాతంలో దుకాణంలో చికెన్ కొడుతున్నాడు. ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న బొలేరో ఒక్కసారిగా షాప్ వైపు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని, గుండెలవిసేలా రోదించారు. భార్య కొలిపాక సమంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.