న్యూఢిల్లీ : రానున్న రోజుల్లో అన్ని విభాగాలను డిజిటల్ మయం చేసే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ కూడా డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఇచ్చే విషయాలను ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ పేమెంట్స్కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఆ దిశగా మిగతా విభాగాల్లో కూడా డిజిటలైజేషన్ దిశగా పయనిస్తున్నది.
పాస్పోర్టులను ఇప్పటివరకు బుక్ రూపంలో ఇస్తుండగా.. ఇకపై ఎలక్ట్రానిక్ రూపంలో ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈజ్ ఆఫ్ బిజినెస్ 2.0 లో భాగంగా ఈ-పాస్పోర్టులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అదేవిధంగా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తున్నది. రానున్న రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
అదేవిధంగా, ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులను అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం.. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా ఎదుర్కొనేందుకు 1 నుంచి 12 తరగతుల వరకు డిజిటల్ విద్యను అందుబాటులో తేవాలని కేంద్రం నిర్ణయించింది. 1 తరగతి 1 టీవీ ఛానెల్ని 12 నుంచి 12,000 టీవీ ఛానెళ్లకు పొడిగించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యా వ్యవస్థ డిజిటలైజేషన్పై దృష్టి సారించారు.