Congress | న్యూఢిల్లీ: వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నేతల అంతర్గత పోరు ఏ పరిణామాలకు దారితీస్తుందోనని అధిష్ఠానం ఆందోళన చెందుతున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్లో నెలకొన్న వర్గపోరును పరిష్కరించడంలో అధిష్ఠానం విఫలమైంది. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి.
ఎన్నికల నేపథ్యంలో అంతర్గతంగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయని, టికెట్ల కేటాయింపు సమయంలో రెండు వర్గాల మధ్య విబేధాలు బయటపడే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లో పార్టీ సీనియర్ నేతలైన మాజీ సీఎంలు దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్ ఎపిసోడ్ కాక రేపుతున్నది. టికెట్ల కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఉన్నట్టు తెలుస్తున్నది. తాజాగా తన వర్గం నేత వీరేంద్ర రఘువంశికి శివపురి నుంచి టికెట్టు ఇవ్వకపోవడం పట్ల కమల్నాథ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వెళ్లి దిగ్విజయ్ బట్టలు చింపండి’ అంటూ.. కార్యకర్తలను ఆయన ఉసిగొల్పడం చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన డిగ్గీరాజా ‘పెద్దలకు వివేకం ఉండాలి’ అంటూ చురకలంటించారు.
రాజస్థాన్లో మొదటి నుంచి కలహాల కాపురమే..
రాజస్థాన్లో 2018లో అధికార పీఠమెక్కిన నాటి నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాలు కొట్లాడుకొంటున్నాయి. గెహ్లాట్పై సచిన్ పైలట్ దాదాపు 20 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన్ను డిప్యూటీ సీఎంగా, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అధిష్ఠానం తొలగించింది. అవినీతిపై పోరాటం పేరుతో సొంత పార్టీ సీఎంపైనే పైలట్ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టారు. కాగా, తాజాగా అశోక్ గెహ్లాట్ సీఎం పదవిపై తనకున్న వ్యామోహాన్ని బయటపెట్టారు. ఢిల్లీలో మాట్లాడుతూ ‘నన్ను నాలుగోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్నట్టు ఇటీవల ఓ మహిళా కార్యకర్త నాతో చెప్పింది. నేను సీఎం పదవిని వదులుకునేంకు సిద్ధంగా ఉన్నాను.. కానీ సీఎం పదవి నన్ను వదలడం లేదని ఆమెతో చెప్పాను’ అని మరోసారి తానే సీఎం అభ్యర్థినని అశోక్ గెహ్లాట్ చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
టికెట్లపై ఎవరి మాట నెగ్గుతుందో?
టికెట్ల పంపిణీలో గెహ్లాట్, పైలట్ మధ్య విభేదాలు తలెత్తున్నట్టు తెలుస్తున్నది. తమ అనుయాయులకు టికెట్టు ఇప్పించుకొంటారా? ఎవరి మాట నెగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు బుధవారం నిర్వహించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సచిన్ పైలట్ను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. కాగా, సచిన్ పైలట్ సీడబ్లూసీ సభ్యుడిగా అధిష్ఠానం ఎంపిక చేయడంపై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ స్పందిస్తూ.. ఇప్పుడు ఆయనే హైకమాండ్ అయ్యారని, టికెట్ల కేటాయింపులో ఆయన పాత్ర ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ముచేసుకొనేనా?
ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొని అధికారంలోకి వద్దామనుకొంటున్న కాంగ్రెస్కు.. కమల్నాథ్, దిగ్విజయ్ మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలో అపార్థాలు, తప్పులు జరుగుతున్నాయంటూ మంగళవారం టికెట్ ఆశావహుడు వీరేంద్ర మద్దతుదారుల ఆందోళన సందర్భంగా దిగ్విజయ్ను ఉద్దేశించి కమల్నాథ్ వ్యాఖ్యలు చేశారు. వీరేంద్రకు టికెట్ దక్కాలని తాను కోరుకొంటున్నానని, అయితే అది జరుగలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో మరో నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని నేతల మధ్య ఐక్యతపై ప్రశ్నలు వస్తున్నాయి.