హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడాశాఖపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్కమిటీకి సాట్స్లో వివిధ క్రీడాంశాలలో కోచ్లుగా సేవలందిస్తున్న వారి వివరాలను, సర్వీస్ క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సాట్స్ ఎండీని ఆదేశించారు. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన ప్లేయర్లతో పాటు జాతీయస్థాయిలో రాణిస్తున్న వారికి యుద్ధ ప్రాతిపాదికన వ్యాక్సిన్లు వేయాలని, అందుకోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా క్రీడాశాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. మరోవైపు వరంగల్, కరీంనగర్లో సాట్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న స్టేడియాల నిర్మాణం, సింథటిక్ ట్రాక్ పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. గచ్చిబౌలి మైదానం అభివృద్ధితో పాటు ఖేలో ఇండియాలో భాగంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు కేంద్ర క్రీడాశాఖకు పంపించాలని సాట్స్ ఎండీని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఈ సమావేశంలో క్రీడా, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు సుజాత, చంద్రవతి, వెంకయ్య, దీపక్ పాల్గొన్నారు.