న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఫస్ట్వేవ్ను సమర్థంగా ఎదుర్కొన్నామని, కానీ సెకండ్ వేవ్ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా ప్రధాన సవాల్గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను నిలుపడానికి అవసరమైన ఆక్సిజన్ను తరలించడంలో లోకో పైలెట్లు, వైమానిక దళ పైలెట్లు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని ప్రధాని కొనియాడారు.
విదేశాల నుంచి ఆక్సిజన్ కంటెయినర్లను తరలించడంలో వాయుసేన కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. అనంతరం వాటిని దేశవ్యాప్తంగా అవసరమైన నగరాలకు తీసుకెళ్లడంలో రైల్వే సిబ్బంది శ్రమిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళా లోకో పైలెట్ శిరీషతో మాట్లాడారు. ఆమె అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి లాంటి సంక్షోభాలు వందేళ్లకోసారి వస్తుంటాయని, అలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడం కష్టతరమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ దేశ ప్రజలు కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారని ప్రధాని చెప్పారు. ఇదివరకు ఎప్పుడూ తెలియని సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు వెన్ను చూపడంలేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాల్గొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లను కూడా ప్రధాని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా రోజూ 20 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నారని, ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని ప్రధాని వ్యాఖ్యానించారు.