President Droupadi Murmu | స్టార్టప్ల ఏర్పాటుతో దేశ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సోమవారం దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె ఆదివారం జాతినుద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో దేశంలో స్టార్టప్లు దూసుకెళ్తున్నాయని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విధానం పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. ఆత్మ నిర్బర్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనేక రంగాల్లో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు. లింగ వివక్ష తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అమర జవాన్ల త్యాగాల వల్లే మనం స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కనుక అమర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆధునిక భారత నిర్మాణానికి ఎందరో మహానుభావులు కంకణ బద్ధులయ్యారన్నారు. వారందరినీ స్మరించుకోవాలని చెప్పారు.
విదేశీ దాస్య శృంఖలాలను తెంచుకుని స్వాతంత్య్రం సాధించుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయ పడ్డారు. యావత్ దేశం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని చెప్పారు. దేశంలో రోజురోజుకు ప్రజాస్వామ్యం బలోపేతం అవుతున్నదని అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శం అని చెప్పారు.
కరోనా వేళ ప్రపంచం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకుంటున్నాయని గుర్తు చేశారు. కరోనా వేళ విపత్కర పరిస్థితులకు సమర్థంగా ఎదురొడ్డి నిలిచాం అని చెప్పారు. కరోనాపై పోరులో విజయం సాధించాం అని అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ప్రస్తుతం పేదరికం, నిరక్షరాస్యతపై భారత్ పోరాడుతున్నదని చెప్పారు.