Delhi Court to CBI | అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా మాజీ అధిపతి ఆకార్ పటేల్పై జారీ చేసిన లుక్ఔట్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని సీబీఐని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఆయనకు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని కూడా సీబీఐ డైరెక్టర్ను గురువారం న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం ( Foreign Contribution Regulation Act – FCRA) కేసులో ఆయనపై సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. ఆకార్ పటేల్ బుధవారం అమెరికా బయలుదేరకుండా నిలువరించింది. ఈ నేపథ్యంలో వచ్చేనెలాఖరు వరకు అమెరికాకు వెళ్లేందుకు అనుమతించాలని ఆకార్ పటేల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆకార్ పటేల్ సంస్థలో కిందిస్థాయి ఉద్యోగి చేసిన పొరపాటుకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ చీఫ్కు లుక్ఔట్ నోటీసు జారీ చేయడం సబబు కాదని కోర్టు పేర్కొన్నది.
ఆకార్ పటేల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న అభియోగంపై ఆయనకు వ్యతిరేకంగా సీబీఐ లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. దర్యాప్తు సంస్థ ఊహాగానాలతో లుక్ఔట్ నోటీసు జారీ చేయడం సరి కాదని న్యాయస్థానం కఠిన పదజాలంతో మందలించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నది. సీబీఐ చర్య వల్ల ఆయన విమాన ప్రయాణాన్ని మిస్ కావడంతోపాటు ఆయనకు రూ.3.8 లక్షల నష్టం జరిగిందని తెలిపింది. లుక్ఔట్ నోటీసు జారీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను మందలించాలని సీబీఐ డైరెక్టర్ను కోరింది. సంస్థ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు రౌజ్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది.
ఆకార్ పటేల్ పుస్తక రచయిత, సామాజిక కార్యకర్త. ప్రధాని నరేంద్రమోదీపై తన పుస్తకాల్లో విమర్శలు చేస్తున్నారు. అందువల్లే విదేశాల్లో లెక్చర్లు ఇవ్వకుండా తనను నిలువరించి ఉండొచ్చునని పేర్కొన్నారు. గతేడాది నవంబర్లో ప్రైస్ ఆఫ్ ది మోదీ ఇయర్స్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందువల్లే తనకు వ్యతిరేకంగా లుక్ఔట్ నోటీసు జారీ అయి ఉండొచ్చునని ట్వీట్ చేశారు.
ప్రత్యేకించి అమెరికా వెళ్లడానికి గుజరాత్ కోర్టు నుంచి అనుమతి పొందినా ఆకార్ పటేల్ను విమానం ఎక్కకుండా సీబీఐ నిలువరించింది. గుజరాత్ పోలీసులు పెట్టిన కేసులో సూరత్ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చిందని సీబీఐ వర్గాలు తెలిపాయి. కానీ రూ.36 కోట్ల విదేశీ నిధుల విషయంలో ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని ఉల్లంఘించినందుకే ఆకార్ పటేల్పై లుక్ఔట్ నోటీసు జారీ చేశామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
2019లో ఆమ్నెస్టీ ఇంటర్నేసనల్ ఇండియా, మూడు దాని అనుబంధ సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల (నియంత్రణ) చట్టం -2010, ఐపీసీలోని వివిధ సెక్షన్లను ఉల్లంఘించారన్న అభియోగాలపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.