న్యూఢిల్లీ: ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ సర్కారు తాయిలాలు ప్రకటించింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. అలాగే పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రానున్న రెండేండ్లలో (2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో) రూ.1,261 కోట్లతో దేశవ్యాప్తంగా 15 వేల ఎస్హెచ్జీ గ్రూపులకు డ్రోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
పీఎంజీకేఏవై మరో ఐదేండ్లు
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగించింది. 81.35 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్న రేషన్ను మరో ఐదేండ్లపాటు ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
పీఎం-జన్మన్కు ఆమోదం
గిరిజన తెగల ప్రజలకు పక్కా ఇండ్లు, పైపుల ద్వారా నీటి సరఫరా, రోడ్డు సౌకర్యం తదితర 11 రకాల వసతుల కల్పన కోసం ప్రధాన మంత్రి జన్జటి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్మన్) అమలుకు ఆమోదం తెలిపింది.
మరో మూడేండ్లు ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులు
లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయాన్ని అందించాలన్న లక్ష్యంతో ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులను మరో మూడేండ్లు కొనసాగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకయ్యే మొత్తం రూ1,952.23 కోట్లలో నిర్భయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.1,207.24 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన రూ.744.99 కోట్లను రాష్ర్టాలు భరించాల్సి ఉంటుందన్నారు.