భోపాల్: ఈమధ్య బుల్డోజర్లు (Bulldozer) తెగ పాపులరయ్యాయి. బుల్డోజర్లను ఇండ్లను కూలగొట్టడానికి, గుంతలు పూడ్చడానికే కాదు పెండ్లి ఊరేగింపు కూడా ఉపయోగించొచ్చని నిరూపించాలనుకున్నాడో ఏమో ఓ వరుడు.. కల్యాణమండపానికి దానిపై ఊరేగింపుగా వెళ్లి అందరని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఊరేగింపును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొంచం వెరైటీగా ఉండటంతో అది వైరల్ అయింది. ఇంకేముంది విషయం కాస్తా పోలీసుల చెవిలో పడింది. దీంతో వరుడుని వాహనంలో ఎక్కించుకున్నందుకుగాను బుల్డోజర్ డ్రైవర్కు పోలీసులు జరిమానా విధించిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లా కెర్పానికి చెందిన అంకుష్ జైస్వాల్ టీసీఎస్లో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 21న అతని వివాహం అయింది. అయితే పెండ్లి ఊరేగింపు కొంచె డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. దీంతో వివాహ వేదిక వద్దకు వెళ్లడానికి ఓ బుల్డోజర్ను మాట్లాడుకున్నాడు. దాని బ్లేడుపై కూర్చుని ఊరేగింపుగా ఫంక్షన్ హాల్కు చేరుకున్నాడు. ఈ వ్యవహారం పోలీసుల చెవిలో పడింది.
దీంతో బుల్డోజర్ డ్రైవర్ రవి భాస్కర్కు రూ.5 వేలు జరిమానా విధించారు. బుల్డోజర్ను వాణిజ్య అవసరాలకే ఉపయోగించాలి కానీ ప్రజారవాణాకు కాదని.. మోటారు వాహన చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదుచేశారు. ఇక్కడ పెండ్లికొడుకు వెరైటీ ఆలోచనకు బుల్డోజర్ డ్రైవర్ బలవడం గమనార్హం.