Bengaluru | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరుగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ప్రతీ ఇంటిముందు నాలుగైదు డ్రమ్ములు, సింథటిక్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. వేసవి రాకముందే తాగునీటికి ఇబ్బందులు ఇలా ఉంటే మరికొన్ని రోజులు అయ్యాక పరిస్థితి ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.
వాటర్ మాఫియా చెలరేగిపోతున్నప్పటికీ, ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇక, మంచినీటి లభ్యత లేకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలు, ఆర్వో యూనిట్లను ప్రభుత్వం మూసివేసింది. పనిచేస్తున్న ఒకటీ, రెండు యూనిట్లలో నీటి చార్జీలను రెట్టింపు చేసింది. దీంతో ప్రభుత్వ వైఖరిపై పాదచారులు, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకొనే స్ట్రీట్ వెండర్స్ మండిపడుతున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాల్సిందిపోయి.. డబ్బులు పిండుకోవడమేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉమ్మడి బళ్లారి తదితర జిల్లాల్లోనూ తాగునీటి కష్టాలు పెరిగాయి. పంపుసెట్ల దగ్గర ఉప్పునీటి కోసం కూడా ప్రజలు గంటలకొద్దీ వేచిచూసే దుస్థితి దాపురించింది.
బెంగళూరు నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యలపై మంగళవారం శాసనసభలో నగరాభివృద్ధి మంత్రి డీకే శివకుమార్ను విపక్ష సభ్యులు నిలదీశారు. ఫిబ్రవరి ముగుస్తున్నప్పటికీ కావేరి జలాలు బెంగళూరువాసులకు అందని దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. దీనిపై స్పందించిన డీకే.. బెంగళూరుకు తాగునీటి సరఫరా పెద్ద సమస్యగా మారిందని, దాన్ని పరిష్కరించాల్సిన అవసరమున్నదని చెప్పారు. నగరంలో 25 శాతం నివాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇప్పటికీ మురికివాడలకు నెలకు 10 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. తాగునీటి ధరల పెంచలేదని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నీటి కష్టాలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు.