Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. అలాగే రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని ఆదేశించింది. మరో వైపు ప్రజలంతా తప్పనిసరిగా కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్లో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ భారత్లోని పరిస్థితులను పరిశీలిస్తుంటే.. ప్రస్తుతానికి అంతర్జాతీయ విమానాలను నిషేధించాల్సిన అవసరం, లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదన్నారు. భారతీయుల్లో ‘హైబ్రిడ్ రోగనిరోధక శక్తి’ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైరస్ ఉధృతి పెరిగినప్పటికీ రోగులను ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన అవసరం రాదన్నారు. ప్రజలు మాత్రం నివారణ చర్యలు పాటించాలని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరో వేవ్, వైరస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. విస్తృతమైన టీకా కవరేజీతో భారత జనాభా ఇప్పటికే హైబ్రిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని, ప్రజలు ఈ విషయంలో భయపడ్డొదన్నారు.
చైనాతో పాటు పలు దేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సఫ్దర్జంగ్ హాస్పిటల్ వైద్యుడు నీరజ్ గుప్తా సూచించారు. మాస్క్ ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం తదితర కొవిడ్ నిబంధనలు పాటించడం వంటి చర్యలు వైరస్ వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతాయన్నారు. టీకా, ఇన్ఫెక్షన్ కారణంగా ప్రజలలో ప్రస్తుతం మెరుగైన రోగనిరోధక శక్తి కనిపిస్తోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే ఒమిక్రాన్ BF.7 కారణంగా భారతీయుల్లో తీవ్రమైన సమస్యలు, ఆసుపత్రిలో చేరడం లేదన్నారు. చివరి మూడు వేవ్ల్లో దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు సోకి నయమైందన్నారు. మూడు డోసుల టీకాతో భవిష్యత్లో వచ్చే వేరియంట్లతో రక్షణ ఉంటుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్లో చైనా లాంటి పరిస్థితి అవకాశం లేదు. భారతీ ప్రజల్లో టీ కణాలు చాలా ప్రభావంతంగా కనిపిస్తున్నాయన్నారు. బీఎఫ్.7 వేరియంట్ సోకినా టీ కణాలు ప్రమాదం నుంచి రక్షిస్తాయన్నారు.
టీకాపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్కే అరోరా బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ కరోనా నుంచి రక్షణ పొందడం చాలా ముఖ్యమన్నారు. అర్హులైన రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇన్ఫెక్షన్ విషయంలో తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రికాషనరీ డోస్ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. నివారణ చర్యలు, అందరు టీకా వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.