Women MLA’s Rise | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు గణనీయంగా విజయం సాధించారు. మొత్తం 61 మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో ఉత్తరాఖండ్ నుంచి అత్యధికంగా వనితలు గెలుపొందితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మణిపూర్ అసెంబ్లీలో తొలిసారి మహిళలు అడుగు పెట్టనున్నారు. కానీ అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. ఉత్తరప్రదేశ్కు మహిళ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం 33 మందికి పడిపోయింది. వారిలో బీజేపీ, దాని మిత్రపక్షాల నుంచి 25 మంది, ఎస్పీ కూటమిలో ఏడుగురుగు, ఒకరు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. రద్దవుతున్న అసెంబ్లీలో 41 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 2002 ఎన్నికల్లో 26 మంది, 2007లో 23, 2012లో 35 మంది ఎన్నికయ్యారు.
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించిన పంజాబ్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినా.. చెప్పుకోదగిన స్థాయిలో లేదు. 117 స్థానాల పంజాబ్ అసెంబ్లీలో 13 మంది మహిళలు ఎన్నికయ్యారు. 2017లో ఇది కేవలం ఆరు మాత్రమే. 1951 నుంచి 2017 వరకు 1799 మంది మహిళలు పోటీ చేస్తే కేవలం 89 మంది మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో ఎనిమిది మంది విజయం సాధించారు. కానీ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10 శాతం మాత్రమే. 2002లో ఉత్తరాఖండ్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం డబుల్ డిజిట్ దాటలేదు. యంకేశ్వర్ సీటులో తొలి నుంచి ఇప్పటి వరకు మహిళలే ఎన్నికయ్యారు. ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థి శైలేంద్ర సింగ్ రావత్ను బీజేపీ అభ్యర్థి రేణు బిస్త్ ఓడించారు. 2002లో 5, 2007లో 4. 2012లో 4, 2017లో 5, 2022లో 8 స్థానాల్లో మహిళలు ఎన్నికయ్యారు.
లింగ సమానత్వానికి సంబంధించి ఇతర ప్రమాణాల్లో మెరుగ్గా ఉన్నా.. చట్టసభలకు మహిళల ప్రాతినిధ్యం వెనుకబడే ఉన్నారు. 40 స్థానాల గోవా అసెంబ్లీకి ముగ్గురు మహిళలు మాత్రమే ఎన్నికయ్యారు. తొలి నుంచి మహిళా ప్రాతినిధ్యం బలహీనంగానే ఉంటున్నది. 1972-80 మధ్య ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు. 1994లో అత్యధికంగా నలుగురు మహిళామణులు ఎన్నికయ్యారు. గోవా అసెంబ్లీలో ఇదే అత్యధికం. ప్రతి ఎన్నికల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఎన్నికవుతూ వచ్చారు.
గిరిజనుల రాష్ట్రం మణిపూర్లో మాతృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉంది. కానీ అసెంబ్లీలో మాత్రం మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. కానీ ఈ దఫా 60 స్థానాల అసెంబ్లీకి నలుగురు మహిళలు కొత్తగా ఎన్నికయ్యారు. ఇంతకుముందు 2017లో ఇద్దరు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టగలిగారు. 52 శాతం మహిళల ఓటింగ్ ఉన్న మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికైన అతివల సంఖ్య పది శాతానికి కూడా చేరడం లేదు.