కోల్కతా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఓటు కూడా పడనీయవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ బృందం కోల్కతా వెళ్లి మమతాబెనర్జిని కలిసింది. ఈ సందర్భంగా కేజ్రివాల్తోపాటు పంజాబ్ సీఎం భగవంత్మాన్, ఎంపీ రాఘవ్ చద్దా తదితరులు ఉన్నారు.
ఢిల్లీలో అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పునకు విరుద్ధంగా ఆర్డినెన్స్ తీసుకురావడంపై కేజ్రివాల్.. మమతాబెనర్జితో చర్చించారు. ఈ విషయంలో కేంద్రంపై ఢిల్లీ సర్కారు చేసే పోరాటినికి మద్దతు నిలువాలని కోరారు. ఈ భేటీ సందర్భంగా మమతాబెనర్జి మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో గవర్నర్లు, ఆర్డినెన్స్లు, లెటర్ల ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలను పరిపాలించేలా ఉందని మమతాబెనర్జి ఎద్దేవా చేశారు. కలిసి పనిచేద్దామనే ఉద్దేశం ఉంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలన్నారు. బీజేపీకి ఒక్క ఓటు కూడా పడనీయకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఆర్డినెన్స్లు, గవర్నర్లతో రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా అందరూ బీజేపీయేతర పార్టీలకు ఓటు వేయాలని కోరుతున్నానని మమత చెప్పారు.