NEET : నీట్ పేపర్ లీక్ ఎందరో విద్యార్థుల జీవితాల్ని చిదిమేస్తోంది. పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఆవేదనకు, ఒత్తిడికి లోనవుతున్నారు. మళ్లీ పరీక్ష రాయాలనే విషయం వారిపై ఒత్తిడి పెంచుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి మళ్లీ నీట్ పరీక్ష రాసే ఓపిక లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గత నెల 20న జరిగింది. తాజాగా ఈ విషయం మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం రేపుతోంది.
మధ్యప్రదేశ్, మావ్గంజ్ జిల్లాలోని, మగానియా గ్రామానికి చెందిన ఆకాంక్ష చతుర్వేది (18) అనే యువతి కొంతకాలంగా నీట్ కోసం ప్రిపేరైంది. ఆమెకు అండగా ఉండటం కోసం తను కోచింగ్ తీసుకుంటున్న నాగ్పూర్లోనే ఆమె తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. తండ్రి వ్యవసాయం చేస్తూ, వంటలు కూడా చేసేవాడు. ఆ సంపాదనతోనే కూతుల్ని డాక్టర్ చేయాలని కలగన్నారు. ఆమె చదువు కోసం రూ.3 లక్షల అప్పు చేశారు. తండ్రి రైతు కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ డబ్బు తీసుకున్నారు. అలాగే, బంధువుల నుంచి కూడా కొంత అప్పు చేశారు. ఈ క్రమంలో బాగా చదువుకున్న ఆకాంక్ష తాను నీట్ పరీక్ష బాగా రాసినట్లు అందరికీ చెప్పింది.
నీట్ పరీక్ష గత నెల 3న జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష బాగా రాశానని, తనకు మంచి ఫలితం వస్తుందని పరీక్ష అనంతరం తన బంధువులు, సన్నిహితులకు చెప్పింది. అయితే, వారం రోజులకే నీట్ పేపర్ లీకైన విషయం బయటపడింది. దీంతో పరీక్షను ఎన్టీయే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ పరీక్ష రాయాలా అనే ఒత్తిడికి గురైంది. దీంతో మే 20న తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్బంగా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. తనకు మళ్లీ నీట్ పరీక్ష రాసేంత శక్తి లేదని ఆ లేఖలో పేర్కొంది. తన తల్లిదండ్రుల ఆకాంక్షలకు నెరవేర్చలేకపోతున్నానని, వారికి క్షమాపణలు అంటూ లేఖలో పేర్కొంది.
అయితే, ఇప్పుడీ అంశం మధ్యప్రదేశ్లో రాజకీయాలకు వేదికగా మారింది. అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నేతలు ఆ కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు.. వారు తీసుకున్న కిసాన్ క్రెడిట్ లోన్ రూ.3 లక్షలకు సంబంధించి బాకీ చెల్లించడంలో సాయపడతామన్నారు. తాము ఆకాంక్ష కుటుంబానికి అండగా ఉంటామన్నారు.