న్యూయార్క్: ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వెల్లడించారు. ఆ యుద్ధాన్ని ఆపడం వల్ల కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్ని మాట్లాడారు. ఏడాది కాలంలోనే తమ ప్రభుత్వం పలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇండోపాక్ వార్ ఆపడం వల్ల సుమారు కోటి మంది ప్రాణాలను రక్షించారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను మెచ్చుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఏడాది లోపే 8 శాంతి ఒప్పందాలు చేశామని, గాజాలో యుద్ధాన్ని ఆపామని, మిడిల్ ఈస్ట్లో కూడా శాంతి కుదిరిందని, ఇవన్నీ జరుగుతాయని ఎవరూ ఊహించలేదని ట్రంప్ అన్నారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తలను తగ్గించినట్లు చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ 10 మిలియన్ల మంది ప్రజలను కాపాడినట్లు పాకిస్థాన్ ప్రధాని చెప్పారని, ఇది చాలా అద్భుతమని, దీన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఇండో, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలను నిర్వీర్యం చేసినట్లు ట్రంప్ ఇటీవల పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ సమయంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే మే 10వ తేదీన ఆ ఆపరేషన్ ఆగిపోయింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ సుమారు 80 సార్లు చెప్పారు.