చెన్నై: నాలుకకు ఆపరేషన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏడాది బాబుకు వైద్యులు సున్తీ చేశారు. తమిళనాడులోని మదురైలో ఈ సంఘటన జరిగింది. విరుదునగర్ జిల్లా అమీర్పాలేనికి చెందిన కార్తీక, అజిత్ కుమార్ దంపతులకు గత ఏడాది అక్టోబర్లో బాబు పుట్టాడు. మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ఆ బాబుకు పుట్టుకతో నాలుకలో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. కొన్ని రోజుల తర్వాత శస్త్రచికిత్స చేశారు. ఏడాది తర్వాత తిరిగి రావాలని, మరో సర్జరీ చేయాల్సి ఉందని బాబు తల్లిదండ్రులకు చెప్పారు.
కాగా, ఆ బాబుకు గత నెలలో ఏడాది వయసు నిండింది. దీంతో ఆ చిన్నారి నాలుకకు రెండో సర్జరీ కోసం తల్లి దండ్రులు ఇటీవల రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే బాబును పరిశీలించిన తర్వాత ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు నాలుకకు సర్జరీ బదులు ప్రైవేట్ భాగం వద్ద సున్తీ చేశారు. దీనిని గుర్తించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బాబును తిరిగి ఆపరేషన్ థియేటర్కు తీసుకుని నాలుకకు సర్జరీ చేశారు.
మరోవైపు బాబు ప్రైవేట్ భాగం వద్ద సున్తీ ఆపరేషన్ చేయడంపై ప్రశ్నించిన తండ్రి అజిత్కు ఆసుపత్రి సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. ఎమర్జెన్సీ వల్ల అలా చేయాల్సి వచ్చిదంటూ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. బాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాలుడి తండ్రి వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు.