Intellegence Officer Jobs | కేంద్ర హోంశాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 / ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంశాఖ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది.
అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఏదేనీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18-27 ఏండ్ల మధ్య వయస్సు గల వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం, ఇతర వసతులు కల్పిస్తారు.
అభ్యర్థులకు పెట్టే రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ద్వారా అర్హులను సెలెక్ట్ చేస్తారు. రెండు దశల రాత పరీక్షలు, మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సెలెక్టెడ్ అభ్యర్థుల డాక్యుమెంట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రవర్తనపై వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు.
గత నెల 25న అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 అర్థరాత్రి 11.59 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేయొచ్చు. ఈ నెల 19 వరకు ఎస్బీఐలో చలానా ద్వారా దరఖాస్తు ఫీజు పే చేయొచ్చు. పరీక్ష ఫీజు రూ.100, రిక్రూట్ మెంట్ ప్రాసెసింగ్ ఫీజు రూ.450 చొప్పున పే చేయాలి.
ఆన్ లైన్ లో రాత పరీక్ష నిర్వహిస్తారు. టైర్ -1 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నల ప్రశ్నాపత్రం ఇస్తారు. గంట సమయంలో పూరించాలి. టైర్ -2 పరీక్ష 50 మార్కులు. డిస్క్రిప్షన్ విధానంలో పరీక్ష ఉంటుంది. వ్యాస రూప ప్రశ్నలకు 30 మార్కులు, ఇంగ్లిష్, తదితర ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షకూ గంట సేపు సమయం ఉంటుంది. టైర్ 3 పరీక్షలో ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. సైకోమెట్రిక్, ఆప్టిట్యూడ్ పరీక్ష ఇందులో భాగంగా ఉంటాయి.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, వరంగల్ అర్బన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. వీటిల్లో అభ్యర్థులు ఐదు సెంటర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు.