న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. మరో వేవ్ చుట్టుముట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 24,882 కేసులు నమోదయ్యాయి. గత 83 రోజుల్లో ఇవే అత్యధికం. కేసుల పెరుగుదలకు కారణమేమిటన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. అయితే కొవిడ్ నిబంధనలు పాటించడం, ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేయడం ద్వారా వైరస్కు అడ్డుకట్ట వేయొచ్చని వారు చెబుతున్నారు. కరోనా తాజా విజృంభణకు వైరస్లో జరిగిన కొత్త ఉత్పరివర్తనాలా? లేక ప్రజల నిర్లక్ష్యమే కారణమా? అన్నదానిపై అధ్యయనం చేస్తున్నట్టు సీఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి సమయం పడుతుందని చెప్పారు. లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ డీన్ మోనికా గులాటీ మాట్లాడుతూ.. పలు దేశాల్లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ రకాలు (వైరస్ స్ట్రెయిన్స్) అసలైన దాని కంటే ప్రమాదకరంగా ఉన్నాయని, ఆయా దేశాల్లో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నదని చెప్పారు. అయితే భారత్లో కరోనా తీవ్రత ప్రస్తుతానికి అంతగా లేదని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భోపాల్, ఇండోర్ జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం లేదా సోమవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావొచ్చని ఆయన తెలిపారు. మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను కొన్నాళ్ల పాటు తెరువవద్దని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. అంగన్వాడీ కార్యకర్తలు ఇంటి వద్దకే వచ్చి సేవలందిస్తారని ప్రకటించింది.
దేశంలో ఒక వారంలో నమోదయ్యే సగటు కేసుల్లో 67 శాతం పెరుగుదల ఉంటున్నట్లుగా తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 11తో ముగిసిన వారంలో సగటున రోజుకు 10,988 కేసులు నమోదుకాగా, ఈ నెల 10తో ముగిసిన వారానికి సగటున రోజుకు 18,371 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా 1.6 శాతం నుంచి 2.6 శాతానికి పెరిగింది.దేశంలో మరో వేవ్ వచ్చే ప్రమాదమున్నదని సీఎస్ఐఆర్-సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు.