చెన్నై: అయోధ్యలో రామాలయానికి ఈనెల 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే.అయితే రామాలయాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ మసీదును కూల్చి అక్కడ ఆలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్( Udhayanidhi Stalin) తెలిపారు. తమ పార్టీ మతవిశ్వాసాలకు వ్యతిరేకం కాదు అని డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ ఈ అంశాన్ని పేర్కొన్నారు. 1992లో కూల్చిన బాబ్రీ మసీదు స్థానంలోనే రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మికతను, రాజకీయాన్ని జోడించడం సరికాదు అని తమ పార్టీ ట్రెజరర్ టీఆర్ బాలూ చెబుతుంటారని స్టాలిన్ అన్నారు.
నీట్ పరీక్ష గురించి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఆ పరీక్షను రద్దు చేయాలని తమ సర్కార్ భావిస్తున్నట్లు చెప్పారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 85 లక్షల సంతకాలను సేకరించినట్లు ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. సేలమ్లో జరిగిన యూత్ వింగ్ సదస్సులో ఆ సంతకాల పత్రాలను సీఎం స్టాలిన్కు అందించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆన్లైన్, పోస్టు ద్వారా వచ్చిన సంతకాలను ఢిల్లీలోని రాష్ట్రపతికి అందజేయనున్నట్లు వెల్లడించారు. సేలమ్ సదస్సుకు 4 లక్షల మంది యువత హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.