చెన్నై: తమిళనాడు చరిత్రలో తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎంఆర్కే పన్నీర్సెల్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో శనివారం సమర్పించారు. రైతులు, వ్యవసాయ నిఫుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. ‘వ్యవసాయ బడ్జెట్ రైతుల ఆకాంక్ష. ఇది ప్రకృతి ప్రేమికుల కల. తమిళనాడులో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ సమర్పించడం ఇదే మొదటిసారి’ అని ఆయన పేర్కొన్నారు.
2021-22 ఆర్థిక ఏడాదిలో వ్యవసాయం, అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, సెరికల్చర్, అటవీ వంటి సంబంధిత శాఖలకు రూ.34,220.65 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి పన్నీర్సెల్వం చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్ అందించడానికి రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ అయిన తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్కు రూ. 4,508.23 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కావేరి డెల్టా ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కూలీల శ్రేయస్సు కోసం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ ప్రాంతాన్ని వ్యవసాయ పారిశ్రామిక కారిడార్గా ప్రకటించాలని ప్రతిపాదించినట్లు మంత్రి వెల్లడించారు. తంజావూర్ వంటి ప్రాంతాల్లో వరి, పప్పులు, అరటి, కొబ్బరి వంటి పంటలు ఏడాది పొడవునా ఉత్పత్తి అవుతుందన్నారు. కాగా, గత అన్నాడీఎంకే ప్రభుత్వం కావేరి డెల్టా ప్రాంతాన్ని రక్షిత వ్యవసాయ జోన్గా ప్రకటించింది.
తమిళనాడులోని అన్ని గ్రామాల్లో వ్యవసాయాభివృద్ధి, స్వయం సమృద్ధిని సాధించడానికి రూ.1,245.45 కోట్ల వ్యయంతో ఒక పథకం అమలు చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరు మీద ప్రారంభించే ఈ పథకాన్ని ఈ ఏడాది 2,500 గ్రామ పంచాయితీలలో అమలు చేస్తామని చెప్పారు. తమిళనాడులోని 12,524 గ్రామ పంచాయితీలలో, ప్రతి ఏటా ఐదవ వంతు చొప్పున ఈ పథకం అన్ని పంచాయతీల ప్రాంతాలలో ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రూ.33.03 కోట్ల వ్యయంతో ‘సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి పథకం’ అమలు చేస్తామని వెల్లడించారు.