KC Venugopal : కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారికంగా తేదీ ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎం (Karnataka CM) గా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) శనివారం సాయంత్రం అధిష్టానం తరఫున ప్రకటించారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికైన అనంతరం మీడియాతో ఆ వివరాలను వేణుగోపాల్ పంచుకున్నారు.
సీఎల్పీ నేతగా డీకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వేణుగోపాల్ చెప్పారు. డీకే పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించగా.. తొలుత సిద్ధరామయ్య, ఆ తర్వాత పరమేశ్వర ఆయన పేరును సీఎల్పీ సమావేశంలో ప్రతిపాదించారని తెలిపారు. దానికి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెస్ పార్టీకి సమస్య అవుతుందని అంతా భావించారని, అయితే తమదంతా ఒక కుటుంబమని, అంతా ఏకగ్రీవంగా ఈ ఎన్నికను ఆమోదించడం పార్టీకి గర్వకారణమని అన్నారు.
2028లోనూ నాయకులందరి సపోర్ట్తో కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అదికారంలోకి వస్తుందని కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధరామయ్య ఈనెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది.