బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల హైవోల్టేజ్ ప్రచారానికి తెరపడింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సుడిగాలి ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేసి ర్యాలీలు, మెగా రోడ్షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. ఇక ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) కౌంటర్ ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్ను పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై సిద్ధరామయ్య స్పష్టత ఇవ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగం గురించి తాము హోంమంత్రి అమిత్ షా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కర్నాటక ఫలితాలపై తాము పూర్తి విశ్వాసంతో, ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. బెంగళూర్లో ప్రచారానికి చివరిరోజైన సోమవారం జరిగిన రోడ్షో సందర్భంగా ప్రియాంక గాంధీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే నెంబర్లను తాను ఊహించలేనన్నారు. ప్రజల నుంచి తమకెలాంటి స్పందన వస్తోందనేదే తాను చూడగలనని చెప్పుకొచ్చారు. అవినీతికి పాతరేయాలని కర్నాటక ప్రజలు కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని అధికారం అందుకోవాలని కాంగ్రెస్ శ్రమిస్తోంది. ప్రధాన పార్టీలకు దీటుగా మెరుగైన ఓట్లు, సీట్లు రాబట్టి కింగ్ మేకర్గా ఎదగాలని జేడీఎస్ పావులు కదుపుతోంది. కాగా, మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Aravind Kejriwal | అరెస్ట్ చేస్తే చేయండి, బెదిరింపులెందుకు.. బీజేపీ బడా నేతలపై ఢిల్లీ సీఎం ఆగ్రహం