బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టోపై కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విమర్శలు గుప్పించారు. ఉచితాలను నిషేధిస్తామని చెప్పిన కాషాయ పార్టీ ఉచిత ఎల్పీజీ సిలిండర్ల హామీని ఎందుకు ఇచ్చిందని నిలదీశారు. కర్నాటక ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు ఉచితాలపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు.
కమలనాధులు పూర్తిగా విఫలమయ్యారని, ఆ పార్టీ బలం నిర్వీర్యమైందని వ్యాఖ్యానించారు. తాము సామాన్యుడికి అండగా నిలబడ్డామని, కాంగ్రెస్ పార్టీ పేదలు, బలహీనవర్గాల మేలు కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. కాగా ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్లను దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా అందిస్తామని బీజేపీ మేనిఫెస్టో పేర్కొంది.
అర్హులైన పేద కుటుంబాలకు నందిని పాలను రోజుకు అరలీటర్ ఉచితంగా అందిస్తామని, ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇక బీజేపీ మేనిఫెస్టోపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోలో సామాన్యుడికి మేలు చేసే పధకాలు లేవని దుయ్యబట్టారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మట్టికరవడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ 150కిపైగా సీట్లలో గెలుపొంది అధికార పగ్గాలు చేపడతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More