DK Shivakumar | కలబురగి, ఏప్రిల్ 14: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన గత ఏడాది మే నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది. కొన్నిసార్లు అయితే ముఖ్యమంత్రి మార్పు తథ్యమనేలా సాక్ష్యాత్తూ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లే వ్యాఖ్యలు చేయడం చూశాం. తాజాగా డీకే శివకుమార్ తీసుకొన్న ‘సంకల్పం’ సీఎం మార్పు అంశాన్ని మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి తెచ్చింది. శివకుమార్ శుక్రవారం కలబురగి జిల్లా దేవల్ తాలుకాలోని ప్రముఖ గురు దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర సీఎంగా ఆలయాన్ని దర్శిస్తానని, గురు దత్త ఆశీస్సులు తీసుకొంటాననే సంకల్పాన్ని ఆయన తీసుకొన్నారు. ఆలయంలో డీకే శివకుమార్ చేత ప్రత్యేక పూజలు చేయించిన పూజారి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి సీఎం హోదాలో ఆలయానికి రావాలని సూచించగా, ఇందుకు డీకే శివకుమార్ అంగీకారం తెలిపారు. శివకుమార్కు గురు దత్తాత్రేయ ఆశీస్సులు ఉంటాయని పూజారి చెప్పారు.
గత ఏడాది మే నెలలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా మొదటి రెండున్నరేండ్లు సిద్ధరామయ్య, తర్వాత రెండున్నరేండ్లు డీకే శివకుమార్కు దక్కేలా ఒక అంతర్గత ఒప్పందం జరిగిందనే వార్తలు వచ్చాయి. తాను సీఎంగా కొనసాగాలంటే లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం సిద్ధరామయ్య ఇటీవల తన సొంత వరుణ నియోజకవర్గంలోని ప్రజలను అభ్యర్థించారు. ఇదే సమయంలో ‘నన్ను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించారు. మీ కోరిక అబద్ధం కాబోదు..’ అంటూ మండ్య సభలో శివకుమార్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
రెండు రోజుల క్రితం కూడా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, పదవిలో కొనసాగమంటే కొనసాగుతానని, లేదంటే దిగిపోతానని పేర్కొన్నారు. మరోవైపు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపుతున్నదని ఆరోపించిన సీఎం సిద్ధరామయ్య.. తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగుతుందని చెప్పారు.