Karnataka | బెంగళూరు, జనవరి 15: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచింది. అక్కడ నాయకత్వ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తప్పించి, ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని నియమిస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్ఠానం ప్రతిపాదించిన ఫార్ములాయే ఇదని, దాని ప్రకారమే అధికార మార్పిడి చోటుచేసుకుంటుందని పార్టీలోని ఒక సీనియర్ నేత తెలిపారు.
అక్టోబర్-నవంబర్ నాటికి సిద్ధరామయ్య స్థానంలో డీకే అధికారం చేపట్టడం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. ఈ నెల 13న బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలోనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సూర్జేవాల, జైరాం రమేశ్ తదితరులు హాజరయ్యారు.
తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ‘నా కుర్చీ ఖాళీ లేదు. నా పదవి భద్రంగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి గందరగోళం లేదని, కానీ కొందరు పాత్రికేయులు పనిగట్టుకుని తనను తప్పిస్తారని ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ జరగదని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా విందుకు మంత్రులు హాజరైతే చాలు మీడియా ఊహాగానాలు చేస్తుందనిఅన్నారు.
ఒక పక్క కర్ణాటకలో సీఎంను మారుస్తారని ప్రచారం జరుగుతున్న వేళ దళితుడినైన తాను ముఖ్యమంత్రిని ఎందుకు కాకూడదని ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్ ప్రశ్నించారు. ‘నేను దళితుడిని, దళితులు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వకూడదు? నేనెందుకు ఆ పదవిని చేపట్టకూడదు. నేను ముఖ్యమంత్రిని అయితే ఎవరు అభ్యంతరం చెబుతారు?’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు.
సీఎల్పీ సమావేశం తన పేరును ఆమోదిస్తుందో లేదో తెలియదు కానీ, ఈ అంశాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని, అధిష్ఠానం నిర్ణయిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని మార్చే నిర్ణయం అధిష్ఠానిదేనని ఆయన స్పష్టం చేశారు. మూడు ఆవుల పొదుగులను నరికివేసిన ఘటనపై బీజేపీ నిరసన తెలపడాన్ని ఆయన ప్రస్తావిస్తూ దళితులను హత్య చేసినప్పుడు బీజేపీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.