బెంగళూర్ : కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి మంత్రి రాజీనామా సరిపోదని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం తనను మంత్రి పెద్దమొత్తంలో కమిషన్ చెల్లించాలని కోరాడని కాంట్రాక్టర్ ఆరోపించడంతో మంత్రి ఈశ్వరప్ప చిక్కుల్లో పడ్డారు.
అవినీతి కేసు నమోదు చేసి మంత్రి ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ను తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆయన భార్య, తల్లి, సోదరుడు ఆరోపిస్తున్నారని, బాధితుడిని మంత్రి 40 శాతం కమిషన్ చెల్లించాలని డిమాండ్ చేశారని చెబుతున్నారని అన్నారు. ఈ అంశాలను ఎఫ్ఐఆర్లో ఎక్కడ పొందుపరిచారని ప్రశ్నించారు.
తాము డీకే శివకుమార్ లేదా కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడటం లేదని తాము కర్నాటక ప్రజల గళాన్ని వినిపిస్తున్నామని చెప్పారు. కాగా తీవ్రమైన ఆరోపణలు చుట్టుముట్టడంతో తాను శుక్రవారం మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అంతకుముందు రోజు ఈశ్వరప్ప తేల్చిచెప్పారు. శుక్రవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి అందచేస్తానని ఆయన పేర్కొన్నారు.