జైపూర్: రాజస్థాన్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ (BJP) మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. 115 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఆల్వార్ ఎంపీ బాబా బాలక్నాథ్ (Baba Balaknath) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. రాజ్సమంద్ ఎంపీ దియా కుమారి (Diya Kumari) సీఎం పదవిని చేపట్ట నుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జైపూర్లోని విద్యాధర్ నగర్ స్థానం నుంచి 71 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించింది.
జైపూర్ రాజవంశానికి చెందిన ఆమె సీఎంగా బాధ్యతలు ఇస్తే తీసుకుంటానని చెప్పారు. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని తెలిపారు. అయితే ఆ అంశాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించాల్సి ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా తమ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధిస్తుందని వెల్లడించారు. బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అవినీతి కాంగ్రెస్ను ప్రజలు ఓడించారని, అభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు.
కాగా, రాజస్థాన్ యోగిగా పేరొందిన ఆల్వార్ ఎంపీ బాబా బాలక్నాథ్ పేరు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నది. బీజేపీలో సీనియర్ నేతలుగా ఉన్న మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. జారా నియోజకవర్గం నుంచి బాబా బాలక్నాథ్ తి పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్ సీఎంగా బరిలో ఉంటారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. బీజేపీకి ప్రాణాధారమైన మోదీ కింద పనిచేయడానికి తాను ఇష్టపడతానని, సీఎం ఎవరు అన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని బాలక్నాథ్ అన్నారు.