Congress | బెంగళూరు, నవంబర్ 28: కర్ణాటకలో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర ముఖ్య నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలతో రాష్ట్రంలో పాలన పడకేసింది. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి మరీ నేతలు పదవుల కోసం కుస్తీలు పడుతున్నారు.
రాష్ట్రంలోని కీలక ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల పదవుల పంపిణీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. అసంతృప్తి జ్వాలలు రాజేసింది. తమ వర్గం ఎమ్మెల్యేలు, నేతలకు ఆ పదవులు ఇప్పించుకొనేందుకు రాష్ట్ర కీలక నేతలు ప్రయత్నాలు చేయడంతో ఆ పంచాయతీ గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. నియామకాల విషయంలో రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ పదవుల భర్తీకి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని బహిరంగానే తన అసమ్మతి వ్యక్తం చేశారు.
అధిష్ఠానం ఓకే చేస్తేనే..
ఎట్టకేలకు పదవుల భర్తీకి సంబంధించి తుది జాబితాను తయారు చేశామని, దాన్ని ఆమోదం కోసం పార్టీ హైకమాండ్కు పంపుతామని సీఎం సిద్ధరామయ్య మంగళవారం సాయంత్రం వెల్లడించారు. అధిష్ఠానం ఓకే చేస్తే.. ఆ తర్వాత నియామకాలు చేపడుతామని పేర్కొన్నారు. పదవుల భర్తీ విషయంపై రాష్ట్ర నేతలతో చర్చించేందుకు ఢిల్లీ నుంచి కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా మంగళవారం మరోసారి బెంగళూరుకు వచ్చారు. గత వారం కూడా ఆయన ఈ సమావేశాలు జరిపారు.
సీఎం కుర్చీపైనా లొల్లి
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతారా? లేక మరో కృష్ణుడు వస్తారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. సీఎం పీఠాన్ని దక్కించుకొనేందుకు డీకే శివకుమార్ అంతర్గతంగా వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తున్నది. ఇదే సమయంలో సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళి వంటి నేతలు కూడా రేసులోకి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత సీఎం పదవి కోసం డీకే తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.. రెండున్నరేండ్ల తర్వాత సీఎం చేసేలా డీకేను ఒప్పించినట్టు కూడా ప్రచారం ఉన్నది.