న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న మోదీ సర్కారు.. మరో అడుగు ముందుకేసింది. పీఎస్యూల్లో వాటాలను విక్రయిస్తున్న కేంద్రం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ వీటిని వదలడం లేదు. ఏకంగా 2024-25లో పీఎస్యూల్లో వాటాల విక్రయంతో రూ.50 వేల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ఏడాది మాత్రం రూ.30 వేల కోట్లు రావచ్చునని అంచనావేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా, ఎన్హెచ్పీసీ, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఈడీఏలతోపాటు మరో మూడు సంస్థల్లో వాటాలను విక్రయించడంతో రూ.12,504 కోట్ల నిధులు సమకూరాయి. వచ్చే నెల చివరినాటికి డిజిన్వెస్ట్మెంట్ 30 వేల కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నది.
నిధులు లేక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం డివిడెండ్లపై కన్నెసింది. రిజర్వు బ్యాంక్, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.1.02 లక్షల కోట్ల మేర నిధులు సమకూరవచ్చునని వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించింది. గతేడాది బడ్జెట్లో రూ.48 వేల కోట్లు అంచనావేసినప్పటికీ రూ.1.04 లక్షల కోట్లకు పైగా ఆర్జించింది.