రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లో అధికార మార్పిడి జరగబోతోందన్న చర్చ విపరీతంగా జరుగుతోంది. ఆర్జేడీ అధ్యక్షుడిగా ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ కొనసాగుతున్నారు. అయితే.. వయస్సు రీత్యా, అనారోగ్య సమస్యల కారణంగా పార్టీ పగ్గాలు తేజస్వీ యాదవ్కు అప్పగించడానికి రంగం సిద్ధమైందని ఆర్జేడీలోని ఓ వర్గం విపరీతంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఫిబ్రవరి 10న ఆర్జేడీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బిహార్ రాజకీయాలు, దేశ రాజకీయాలతో పాటు ఆర్జేడీ సంస్థాగత వ్యవహారాలపై కూడా చర్చించనున్నారు. వీటన్నింటితో పాటు ఆర్జేడీ అధ్యక్ష బాధ్యతలను తేజస్వీ యాదవ్కు అప్పగించే విషయం కూడా ఈ వేదికపై నుంచే ప్రకటించనున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఆరోగ్యంగా లేకపోయినా.. రాజకీయంగా మాత్రం చురుకే
ఇక.. ఆర్జేడీలోనే మరో వర్గం మరోలా అంటోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగోలేదన్నది నిజమేనని అంగీకరించారు. అయితే ఆయన ఆరోగ్యంగా లేకపోయినా… రాజకీయంగా మాత్రం అత్యంత చురుకుదనంతోనే వున్నారని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ వాహనాలను నడిపే స్థితిలో కూడా ఉన్నారని, సభలల్లో పాల్గొనే శక్తి కూడా ఆయనకు వుందంటున్నారు.
ఊహాగానాలపై స్పందించిన లాలూ, రబ్రీ దేవి
ఆర్జేడీ అధ్యక్ష బాధ్యతలు తేజస్వీ యాదవ్కు అప్పగిస్తున్నారన్న వార్తలపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ తప్పుడు వార్తలేనని తేల్చేశారు. కేవలం మూర్ఖులు మాత్రమే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి తెస్తున్నారని, అలాంటి అవకాశాలేవీ లేవని లాలూ ప్రసాద్ ఢిల్లీ వేదికగా స్పష్టం చేశారు. అయితే పార్టీ నిర్వహణతో పాటు ఇతర అంశాలను మాత్రం తేజస్వీయే చూసుకుంటున్నారని లాలూ స్పష్టం చేశారు. ఇక బిహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ భార్య రబ్రీదేవి కూడా ఈ ఊహాగానాలపై స్పందించారు. అన్నీ తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంటూ రబ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు. ఇక లాలూ పెద్ద కుమారుడు తేజ్ప్రతాప్ కూడా స్పందించారు. ఆర్జేడీ అధ్యక్షుడిగా లాలూ ఇప్పుడు వున్నారని, ఇకముందూ వుంటారని స్పష్టం చేశారు.