రైల్వే స్టేషన్లో ఒంటరిగా దొరికిన ఒక పిల్లాడు.. ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో 2016 అక్టోబరు 21న ఒక బాలుడు ఒంటరిగా కనిపించాడు. అధికారులు ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ మానసిక వికలాంగుడైన ఆ బాలుడు తన పేరు ‘భరత్’ అని మాత్రమే చెప్పగలిగాడు.
మిగతా వివరాలేవీ చెప్పలేకపోయాడు. దీంతో ఆ బాలుడిని ప్రభుత్వ సీనియర్ బాలుర అనాధాశ్రమానికి తరలించారు. అక్కడ కౌన్సిలర్గా ఉన్న మమేష్ రాండీవే.. బాలుడికి ఆధార్ కార్డు ఇప్పించడం కోసం ఆధార్ సేవా కేంద్రానికి ఈ ఏడాది జనవరిలో తీసుకెళ్లాడు. అయితే అతనికి కొత్త ఆధార్ కార్డు రిజిస్టర్ చేయడం కుదరలేదు. సదరు బాలుడి బయోలాజికల్ వివరాలు అప్పటికే డేటాబేస్లో ఉన్నట్లు తేలింది.
దాంతో ఆ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన అధికారులు.. బెంగళూరుకు చెందిన భర కుమార్ బీసీ అనే బాలుడి పేరున 2021లో ఆధార్ కార్డు నమోదైనట్లు తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా బెంగళూరు చేరుకొని భరత్ కుటుంబం కోసం ఆరా తీయగా.. భరత్ తండ్రి కొంతకాలం క్రితం మరణించినట్లు తెలిసింది. తల్లి బ్రతికే ఉండటంతో 19 ఏళ్ల భరత్ను ఆమెకు అప్పగించారు అధికారులు.