బీజింగ్: చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ పాలసీ.. భారతీయులకు ఇబ్బందిగా మారుతోంది. డ్రాగన్ దేశంలో చదువుకుంటున్న, వ్యాపారం చేస్తున్న వారంతా ప్రస్తుతం అవస్థలు పడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో రెండు దేశాల మధ్య నడవాల్సిన డైరెక్ట్ విమానాలను మూడేళ్ల క్రితమే రద్దు చేశారు. ఇప్పటి వరకు ఆ విమానాలను మళ్లీ పునరుద్దరించలేదు. దీంతో చైనాలో మెడిసిన్తో పాటు ఇతర కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
కోవిడ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో బీజింగ్, ఢిల్లీ మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి. చైనాలో సుమారు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్లంతా కాలేజీల్లో చేరేందుకు తెగ కష్టాలు పడాల్సి వస్తోంది. డైరెక్ట్ విమాన సర్వీసులు లేకపోవడంతో మరో రూట్లో వాళ్లు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. కానీ మూడవ రూట్లో వెళ్లేందుకు భారీగా ఖర్చులు అవుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ శాతం మంది హాంగ్కాంగ్ మీదుగా చైనాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా నుంచి హాంగ్కాంగ్కు డెయిలీ విమానాలు ఉన్న కారణంగా.. ఆ రూట్లోనే వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.