కోల్కతా : బీజేపీ నేతల నోటిదురుసు వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నేత (టీఎంసీ)పై బెంగాల్ నేత, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ నోరుపారేసుకున్నారు. తమ పార్టీ విమర్శకులపై టీఎంసీ నేత సౌగత రాయ్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఆయనను చెప్పుతో కొడతారని దిలీప్ ఘోష్ అన్నారు.
ఘోష్ వ్యాఖ్యలను తప్పుపట్టిన రాయ్ బీజేపీ నేతకు కనీస విద్యార్హత లేదని మండిపడ్డారు. కాషాయ శిబిరంలో విశ్వాసం కోల్పోయిన దిలీప్ ఘోష్ టీఎంసీతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. తమ నేతలు పార్ధ ఛటర్జీ, అనుబ్రత మొండల్ను వివిధ కేసుల్లో అరెస్ట్ చేసిన నేపధ్యంలో తమ పార్టీపై విపక్షాలు బురుదచల్లడం సరికాదని అంతకుముందు సౌగత రాయ్ అన్నారు.
నిరసన ముసుగులో పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా తప్పించుకుంటామని నమ్మే వారి చర్మం ఒలిచి బూట్లు తయారు చేస్తారని రాయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు గాను తర్వాత రాయ్ క్షమాపణ చెప్పారు. ఇక రాయ్ విమర్శలను దిలీప్ ఘోష్ ప్రస్తావిస్తూ సౌగత రాయ్ సీనియర్ నేతని, గతంలో ప్రొఫెసర్గానూ పనిచేశారని విపక్షాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తమకు విస్మయం కలిగించాయని అన్నారు. సౌగత రాయ్ను ప్రజలు చెప్పులతో కొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఘోష్ హెచ్చరించారు.s