న్యూఢిల్లీ : పంజాబ్ పర్యటనలో ప్రధాని కాన్వాయ్ నడిరోడ్డుపై 20 నిమిషాలు నిలిచిన అనంతరం తిరుగుముఖం పడుతూ తాను ప్రాణాలతో బయటపడ్డానని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్ నుంచి ప్రధాని ప్రాణాలతో బయటపడ్డారు కానీ 700 మందికి పైగా రైతులను సజీవంగా వారి ఇండ్లకు తిరిగి వెళ్లేందుకు అనుమతించలేదని మండిపడ్డారు.
జర్మన్ నియంత హిట్లర్కు ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి తేడా లేదని దుయ్యబట్టారు. ప్రధాని క్షేమంగా ఇంటికి చేరుకున్నా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 700 మందికి పైగా రైతులు ప్రాణాలతో ఇండ్లకు చేరుకోలేదని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ప్రధాని కేవలం 15 నిమిషాలు ఇబ్బంది పడితే సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా పలు సమస్యలు ఎదుర్కొన్నారని సిద్ధూ పేర్కొన్నారు. ప్రధాని పంజాబ్ టూర్లో నెలకొన్న భద్రతా లోపం అంశాన్ని రాజకీయం చేయవద్దని కాషాయ పార్టీకి కాంగ్రెస్ హితవు పలికింది.