న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం ఓ సాధారణ ఎంపీ మాత్రమేనని, ఆయన స్ధాయికి మించి మీడియా హైలైట్ చేయరాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ (Lakshman Singh) అన్నారు. గుణలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ లక్ష్మణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో రాహుల్ ప్రకటన చేసే సమయంలో టీవీలో ఆయన ముఖాన్ని తక్కువ సేపు చూపిస్తున్నారని ప్రశ్నించగా, రాహుల్ గాంధీ కేవలం ఓ ఎంపీ, ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, కార్యకర్త అని లక్ష్మణ్ సింగ్ అన్నారు.
రాహుల్ గాంధీ గురించి చెప్పేందుకు ఏమీ లేదు..ఆయనను మీడియా, తామూ హైలైట్ చేయాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. రాహుల్ కేవలం ఎంపీ మాత్రమేనని, ఆయన మిగిలిన పార్టీ ఎంపీలతో సమానమని పేర్కొన్నారు. పుట్టుకతోనే ఏ ఒక్కరూ ప్రముఖులు కాబోరని, వారి పనితీరుతోనే అందలం ఎక్కాలని చెప్పారు. రాహుల్ గాంధీని అంతటి బడా నేతగా పరిగణించవద్దని ఐదు సార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన లక్ష్మణ్ సింగ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై వివరణ కోరినప్పుడు తాను కేవలం పార్టీ కార్యకర్తనేనని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పుకున్నారని గుర్తుచేశారు.
తామంతా పార్టీ కార్యకర్తలమేనని అన్నారు. లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం రేపుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వానికి లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యలు మింగుడుపడటం లేదు. మరోవైపు సోదరుడి వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ ఎలా రియాక్టవుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. ఎప్పటివరకూ తాము కుటుంబ దుకాణంలా పార్టీని నడిపించాలని కాంగ్రెస్ నేతలు పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గతంలో కాంగ్రెస్లో పనిచేసిన బీజేపీ నేత హెహజాద్ పూనావాలా అన్నారు.
Read More :
Pariksha Pe Charcha | పరీక్షా పే చర్చ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఈ నెల 12 వరకు అవకాశం