ఉలుబేరియా: నందీగ్రామ్ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆమె ఓటమి ఖాయమని.. మరో నియోజకవర్గం నుంచి దీదీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఉలుబేరియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తొలుత నందీగ్రామ్కు వెళ్లారు, అక్కడ ప్రజలు సమాధానం ఇచ్చారని, మీరు ఇంకెక్కడికి వెళ్లానా, సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోదీ అన్నారు. అయితే 8 దశల్లో జరగనున్న బెంగాల్ ఎన్నికలకు చివరి దశ కోసం నామినేషన్ వేసేందుకు ఇంకా గడువు ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ కామెంట్ చేశారు. తృణమూల్ పార్టీ మాత్రం మోదీ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. నందీగ్రామ్లోనే మమతా బెనర్జీ విజయం సాధించనున్నట్లు టీఎంసీ చెప్పింది. అక్కడ తమదే గెలుపు అని సువేందు కూడా తెలిపారు.
బెంగాల్ సంస్కృతిని మమతా బెనర్జీ అవమానిస్తున్నారని, బంగ్లాదేశ్లో ఆలయానికి వెళ్తే దాన్ని ఆమె తప్పుపట్టారని అన్నారు. కాళీ మాత ఆలయంలో తాను పూజలు చేయడాన్ని దీదీ వ్యతిరేకించినట్లు తెలిపారు. మత విశ్వాసాలను అవసరానికి తగినట్లు వాడమని, మన నమ్మకాలను, సాంప్రదాయాలను గర్వంగా భావిస్తామని ప్రధాని అన్నారు.
నందీగ్రామ్లో రెండు గంటల పాటు తనను అడ్డుకున్నట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర బలగాలు బీజేపీకి సహకరించేలా హోంమంత్రి అమిత్ షా ఆదేశించినట్లు ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘానికి 63 ఫిర్యాదులు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. నందీగ్రామ్లో బీజేపీ గెలవదని, 90 శాతం ఓట్లు టీఎంసీకే పడినట్లు దీదీ అన్నారు. దీదీయే రెండు గంటల పాటు పోలింగ్ను నిలిపివేసినట్లు బీజేపీ ఆరోపించింది. నందీగ్రామ్లో ఎటువంటి సమస్యలేదని, కానీ దీదీయే డ్రామా చేస్తున్నట్లు సువేందు ఆరోపించారు.